కొడుకు పుట్టుక తండ్రిశాపంగా.. ప్రకాశం జిల్లాలో ఘోరం..

ప్రాణం తీసిన ఈత సరదా

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. కొడుకు పుట్టుక తండ్రికి శాపంలా మారిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. భార్య ప్రసవించి రోజైనా గడవలేదు.. కన్నకొడుకును తండ్రి సరిగ్గా చూడను కూడా లేదు. అకాల మృత్యువు భర్తను అమాంతం మింగేసింది. జలగండం రూపంలో తండ్రి బలి అయ్యాడు. అప్పుడే పుట్టిన బిడ్డకు తండ్రి దూరమయ్యాడు. కన్నబిడ్డను మురిపెంగా చూపుదామనుకున్న భార్యకు భర్తని దూరం చేసింది. మనవడు పుట్టిన సంతోషంలో ఉన్న ముసలోళ్లకు.. కాలువలో మునిగి కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి తీరని విషాదంలో మునిగిపోయారు.

ప్రకాశం జిల్లాలోని దర్శి మండలంలో అబ్బాయిపాలేనికి చెందిన అజయ్‌ రెడ్డికి గత సంవత్సరం పెళ్లైంది. భార్యకి నెలలు నిండి దర్శి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడంతో మగబిడ్డను ప్రసవించింది. ఇంటి వద్దనే ఉన్న భర్త అజయ్ రెడ్డి సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలసి ముండ్లమూరు మండలం రెడ్డి నగర్ సమీపంలోని సాగర్ కాల్వలో ఈతకెళ్లాడు. కాల్వలో దిగిన స్నేహితులు మునిగిపోవడం చూసిన అజయ్.. వారిని కాపాడి పూడులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.