తల్లిని చంపిన నీచుడు

తల్లిని చంపిన నీచుడు

మద్యం సేవించి వచ్చినందుకు మందలించిందని ఓ వ్యక్తి తన తల్లిని చంపి ఆమె చితిపైనే కోడిని కాల్చుకున్న తిన్న భయంకర ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. మద్యం మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పశ్చిమ్ సింగ్బమ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్మాది ప్రధాన్ సోయ్ (35) మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన అతడిని తల్లి సుమీ సోయ్ (60) ఆగ్రహం వ్యక్తం చేసింది. భోజనం కూడా పెట్టకుండా తల్లి తనను మందలించడం భరించలేకపోయిన ప్రధాన్ ఓ కర్రతో ఆమెపై దాడి చేశాడు. అతడు బలంగా కొట్టడంతో ఆ వృద్ధురాలు మరణించింది.

అనంతరం ఆమె మృతదేహాన్ని తన ఇంటి పెరట్లో దహనం చేసేందుకు ప్రయత్నించాడు. హృదయం లేని ఆ కర్కశుడు సభ్యసమాజం తలదించుకునేలా తల్లి చితి మండుతుండగా, ఆ మంటల్లో కోడి మాంసం కాల్చుకుని తిన్నాడు. ఇది అతడి సోదరి సోమ్వారీ కంటబడటంతో ఆమె ఇరుగు పొరుగువారిని అప్రమత్తం చేసింది. దీంతో స్థానికులు చేరుకుని అతడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రధాన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

‘శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత నిందితుడిని తన తల్లిని తిట్టింది.. దీంతో తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన అతడు ఆమెను కర్రతో కొట్టాడం వల్ల తల్లి మరణించింది’ అని మనోహర్‌పూర్ స్టేషన్ పోలీస్ అధికారి రాహుల్ కుమార్ తెలిపారు. అంతేకాదు, నిందితుడు నాలుగేళ్ల కిందట తండ్రి గోపాల్ సోయ్‌ను కూడా హత్య చేసినట్టు తెలిపారు. ఆ కేసులో బెయిల్‌పై విడుదలయినట్టు పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడు తన తల్లి చితిపై కోడిని కాల్చుకుని తిన్నట్టు గ్రామస్థులు చెప్పారని దీనిపై విచారణ చేపడతామన్నారు. ప్రస్తుతం అతడిపై హత్య కేసు నమోదుచేశామని, దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.