దేశంలో ఆకలి చావులు

దేశంలో ఆకలి చావులు

దేశంలో ఆకలి చావులపై కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. ఆహారం లేక పేదరికంతో చోటుచేసుకున్న మరణాలపై తాజా నివేదికను సమర్పించాలని, ఆకలిని ఎదుర్కోడానికి జాతీయస్థాయిలో మోడల్ స్కీమ్‌ను ఏర్పాటుచేయాలని సూచించింది. దేశంలో ఆకలి చావుల అంశంపై మంగళవారం నాటి విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఆకలి చావుల విషయంలో 2015-2016 నివేదికపై కేంద్రం ఆధారపడటం పట్ల తీవ్రంగా మండిపడింది. ‘దేశంలో ఒక్కటి తప్ప ఆకలి చావులు లేవని మీరు చెబుతున్నారా? మేము ఆ ప్రకటనపై ఆధారపడగలమా?’ అని నిలదీసింది. ‘‘ఆకలి మరణాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటే దేశంలో ఆకలి చావులు లేవని అర్ధం చేసుకోవాలా? ఆకలి చావులపై కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారంతో నివేదికను సమర్పించాలి.. దీనిపై అధికారులను అడిగి సమాచారం సేకరించండి’’ అని కేంద్ర తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించారు.

‘వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రకటించాయి.. అలాగే, కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ కిచెన్‌‌ల విధానంపై కేంద్రం విస్తృతంగా ప్రచారం కల్పిస్తోంది.. ఇది ఎన్నికల సమయం.. మీరు పాలసీని రూపొందించి, అదనపు ఆహార ధాన్యాలను అందజేస్తే అప్పుడు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నాయి’ అన పేర్కొంది.

134 పథకాలు అమలులో ఉన్నాయని, ఇప్పటికే ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నందున ఎక్కువ నిధులను రాష్ట్రాలకు మళ్లించలేమని వేణుగోపాల్ కోర్టుకు తెలియజేయగా.. అదనపు ఆహార ధాన్యాలను అందించడాన్ని పరిశీలించాలని ధర్మాసనం కోరింది. రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరిపి, అదనపు లాజిస్టిక్స్, వనరులు, ఆహార ధాన్యాలను విస్తరించడానికి వీలుగా కమ్యూనిటీ కిచెన్‌ల కోసం జాతీయస్థాయిలో నమూనా పథకాన్ని రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

‘‘దేశంలోని ప్రజలెవరూ ఆకలితో బాధపడకూడదు.. ఆకలితో మరణించకూడదు.. ఈ అంశంపై మీ అధికారులతో చర్చించి ఓ నోడల్ పథకాన్ని రూపొందించండి.. మేము ఈ కోర్టు ఉద్దేశాన్ని వివరించాం.. పరిష్కారాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉంది.. పోషకాహార లోపం అనే పెద్ద సమస్యలపై మేము చెప్పడం లేదు… ఆకలి తీర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య ఉందని అంగీకరిస్తున్నారు.. మానవతా దృక్పథంతో ఆలోచించండి.. మీ అధికారులను వారి మనసుతో ఆలోచించమని కోరండి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

‘దేశంలో ఆకలి ఆకలిని ఎదుర్కోవడానికి ఏమీ చేయడం లేదని మేము చెప్పడం లేదు.. కానీ జాతీయస్థాయిలో ఒక మోడల్‌గా పథకాన్ని రూపొందించి.. దానిని ఖరారు చేసి, ఆపై నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు వదిలిపెట్టండి’అని అన్నారు. దీనిపై స్పందించిన అటార్నీ జనరల్ కోర్టు సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు.

‘ఈ సూచనలతో మేం ఒక పథకాన్ని రూపొందించగలం.. రెండు శాతం అదనపు ఆహార ధాన్యాలు రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తాయి.. ఈ రెండు శాతం ఆమోదయోగ్యమా? కాదా? అనేది రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత చూద్దాం’ అని ఆయన పేర్కొన్నారు. అనంతర విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. పోషకాహారలోపం, ఆకలి, ఇతర అంశాలపై అదనపు అఫిడ్‌విట్‌లు దాఖలు చేయాలని సూచించింది.