వివాదాల్లో చిక్కుకున్న బన్వరిలాల్‌

వివాదాల్లో చిక్కుకున్న బన్వరిలాల్‌

వేర్వేరు రాష్ట్రాల వారు తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన వారిలో అధికశాతం కత్తిమీద సాము పరిస్థితిని ఎదుర్కొన్నారు. లౌక్యం తెలిసిన ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ప్రభుత్వంపై మింగుడు పడలేకపోయారు. ప్రస్తుత గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌కు సైతం అదే పరిస్థితులు ఎదరయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ బిల్లుపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్‌ జాప్యం చేయడంతో అధికార, ప్రతిపక్షాలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయి.

గవర్నర్‌ ఆమోదముద్ర కోసం వేచిచూడకుండా రిజర్వేషన్‌పై ప్రభుత్వం జీఓ జారీచేసింది. దీంతో మరో ఆలోచనకు తావివ్వకుండా విధిలేని పరిస్థితుల్లో గవర్నర్‌ ఆమోదించారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులోని ఏడుగురు శిక్షా ఖైదీల విడుదలపై గవర్నర్‌ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.

రెండేళ్లయినా ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ అభీష్టంతో నిమిత్తం లేకుండా గవర్నరే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల నియామాకాన్ని చేశారు. ఈ వీసీల్లో కొందరు ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అన్నావర్సిటీ వీసీ సూరప్ప, ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధమే నడుస్తోంది.

ఈ కారణంగా గవర్నర్‌ పేరు కూడా రచ్చకెక్కింది. ఇలా తమిళనాడులో జరిగే అనేక వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం తెరపైకి రావడంపై కేంద్రం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ బదిలీకి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పైగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వివాదాల్లో చిక్కుకున్న బన్వరిలాల్‌ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.