టీటీడీపీకి పెను షాక్…గెలిచిన ఇద్దరు కూడా కారెక్కుతారా…?

Tdp-Mlas-Sandra-Venkata-Vee

తెలంగాణ శాసనసభలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయకముందే అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందనే వార్తలు జోరందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కారెక్కుతారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. అదే జరిగితే తెలంగాణ శాసనసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేనట్టే!. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారుతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే సండ్ర తన అనుచరులు, నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సత్తుపల్లిలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ నుంచి తనకు వచ్చిన ఆహ్వానం గురించి వారికి వివరించారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో వారి మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం సమంజసమేనని వారు అభిప్రాయపడినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడి ఆధ్వర్యంలో ఈ వ్యవహారం కొనసాగుతోందని, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కొందరు దీనికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. అలాగే అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ఖమ్మంలో కలుసుకుని మంతనాలు సాగించారు. టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందని, ఇద్దరం కలిసి పార్టీ మారుదామని సండ్ర సూచించినట్లు భోగట్టా. అయితే, సండ్ర ప్రతిపాదనకు సమాధానం చెప్పకుండా మెచ్చా నాగేశ్వరరావు వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే, తాను టీడీపీని వీడటంలేదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రకటించారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని కొట్టి పారేశారు. దీనిపై మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ సండ్ర తనను మాట్లాడుకుందాం రమ్మని పిలవడంతో ఖమ్మం వెళ్లానని అన్నారు. ఆయన ఆహ్వానంతో అక్కడకు వెళ్లిన మాట నిజమేనని, పార్టీ ఫిరాయింపు విషయమై సండ్ర తనతో చర్చించారని అన్నారు. అయితే తనకు టీడీపీని వీడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణాలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.