వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి వ్యవహారం రాజకీయంగా ఓ సునామీలా మారుతోంది. అది టీడీపీ అధినేత చంద్రబాబే చేయించారంటూ వైసీపీ, వైసీపీ మీడియా లాజిక్ లేని మార్ఫింగ్ ఆధారాలతో ప్రచారం చేస్తోంది. పోలీసుల విచారణపై నమ్మకం లేదని చెబుతూ థర్డ్ పార్టీ విచారణ అంటూ ఏదేదో కోరుతోంది. దీనికి తెలుగుదేశం పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రం లిమిట్స్ క్రాస్ చేసేశారు. వైసీపీ నేతలు పద్దతి లేకుండా టీడీపీని గురిపెట్టారని తాను కూడా పద్దతి లేకుండా ఆరోపణలు ప్రారంభించారు.
జగన్ పై దాడి వెనుక విజయమ్మ, షర్మిలమ్మ ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పై దాడి చేస్తే టీడీపీ కి ఎలాంటి లాభం లేదని, దాడి ఎపిసోడ్పై పలు అనుమానాలున్నాయన్నారు. అంతటితో ఆగిపోతే సరిపోయేది కానీ జగన్ కుటుంబంలో అనేక విబేధాలు ఉన్నాయని , విజయమ్మ , షర్మిలను జగన్ అణగదొక్కుతున్నారని అందుకే జగన్ కుటుంబ సభ్యులే దాడికి కుట్ర పన్నారనే అనుమానం ఉందన్నారు. సానుభూతి ఓట్లతో గద్దె ఎక్కాలని విజయమ్మ, షర్మిల కుట్రపన్నారని అనిపిస్తోందన్నారు. ఆ కోణంలో విచారణ చేయాలని పోలీసులను కోరుతున్నానని రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.
వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఇప్పటి వరకూ టీడీపీ శ్రేణులు పద్దతిగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. కానీ బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రం దాన్ని వైసీపీ రూట్లోకి తీసుకెళ్లారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇదే రకమయిన విమర్శలు కొత్తగా వచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని చేసి నవ్వుల పాలు అయ్యారు. ఇప్పుడు సీనియర్ అయిన రాజ్దేంద్ర ప్రసాద్ కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ అభిమానులే వారి మీద మండిపడుతున్నారు.