తెలంగాణ… ఆంధ్రా సరిహద్దుల్లో హైటెన్షన్.

తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అందులో ఒక మూడేళ్ల చిన్నారి కూడా ఉండటంతో మరింత ఆందోళన కలుగుతుంది. ఇంకా స్థానికంగా ఎక్కడ వ్యాపిస్తుందని సర్వత్రా భయంకరమైన వాతావరణం నెలకొంది. ఇంతవరకు పిల్లలకు రాదని అంతా కాస్త నిబ్బరంగా ఉన్నారుకానీ.. ఒక్కసారిగా మూడేళ్ల చిన్నారికి రావడంతో ఆందోళన నెలకొంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటీవ్ కేసులు ఇప్పటికే దాదాపుగా 10 వరకు నమోదు అయ్యాయి. అధికార యంత్రాంగం కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఏపీకి వచ్చే అన్ని సరిహద్దులను మూసివేశారు. గరికపాడు చెక్ పోస్టు వద్ద అయితే.. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్వోసీలు ఇచ్చిన తర్వాత వేలాదిగా ఒక్కసారిగా ఆంధ్రావైపు దూసుకొచ్చిన సందర్భాలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. తాజాజగా గరికపాడు చెక్ పోస్టు వద్ద అసలు ఏపీవైపు ఎవరు రావద్దంటూ కూడా నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి పోలీసులు హెచ్చరించారు. ఇదే విషయంపై గత అర్దరాత్రి వరకు ఒక హైడ్రామా నడిచిందనే చెప్పాలి. మొత్తంగా హైవే అయితే ప్రస్తుతానికి నిర్మానుష్యంగా ఉంది.
తెలంగాణ నుంచి ఏపీకి తరలి పోయేవారంతా ఇక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి.. లేదంటే మీరు తిరిగి తెలంగాణాకే వెళ్లిపోవాలంటూ కూడా వాళ్లు చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న ప్రయాణీకులు చేసేదేమి లేక సుమారు మూడువేల మంది తిరిగి తెలంగాణకి వెనుతిరిగారు. ఏపీలో రోజురోజుకు సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణతో పాటు చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను మూసివేశారు. అటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఓ కోరిక కోరింది. అదేమంటే.. పీజీలో ఉన్న విద్యార్థులను, ఉద్యోగులను తిరిగి పీజీలోనే ఉంచి తగిన సదుపాయాలు కల్పించాలని కోరింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడంతో  విద్యార్ధులకు ఏపీ విద్యార్థులకు సదుపాయాలు కేటాయించాలి ఇప్పటికే అక్కడ హాస్టల్స్ మూసివేసారు కాబట్టి ఏపీ వైపు అందరూ వస్తున్న నేపధ్యంలో వాళ్లందరికీ కొంత సౌకర్యాల కల్పించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం నిన్న తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఆ వ్యవహారం సద్దుమనిగింది.