తెలంగాణ మంత్రివర్గ సోమవారం భేటీ

తెలంగాణ మంత్రివర్గ సోమవారం భేటీ

తెలంగాణ మంత్రివర్గ సోమవారం భేటీ కానుంది. తెలంగాణలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశంలో యాసంగి పంటల సాగుకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయడం, ఉద్యోగ నియామకాల్లో స్పష్టత, కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దృష్ట్యా కరోనాపై వైద్యారోగ్యశాఖ సన్నద్ధత తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం ఇప్పటికే ఆర్థికశాఖ ఫైల్ సిద్ధం చేసింది. కొత్త జోనల్‌ విధానం అమలు తర్వాత 70-80 వేల పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందనే దానిపై మంత్రిమండలి చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. పోడు భూముల సమస్య, మెట్రో రైలు విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమలుపైనా ఈ సందర్భంగా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.