ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ…16 అంశాలపై చర్చ…!

Telangana CM KCR Meet To Modi

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించిన తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుసుకున్నారు. డిల్లీలోని 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌‌లో సమావేశమయ్యారు. మొత్తం 16 అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ వినతులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని సమాచారం. సుమారు 40 నిమిషాలపాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీని కలిసిన కేసీఆర్ విభజన హామీలు, పెండింగ్ అంశాలతో పాటూ.. ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై చర్చించారు. పలు రాజకీయ అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.
ఈ భేటీలో ప్రధానికి సుమారు 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కేసీఆర్‌ అందజేశారు.
వినతిపత్రంలోని 16 అంశాలు:
1) తెలంగాణలో నూతన సచివాలయం, నూతన అసెంబ్లీ నిర్మాణానికి బైసన్‌ పోలో భూములను ఇవ్వాలని, అలాగే రక్షణ శాఖకు చెందిన భూములు, పరిసరాల్లో రోడ్ల విస్తరణ చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

2) కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలి.

3) హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.

4) కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.

5) హైదరాబాద్‌లో ఐఐఎస్‌ఈఆర్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి.

6) ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి.

7) జహీరాబాద్‌లో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్ మ్యానుఫేక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు అవకాశం కల్పించాలి.

8) కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేయాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో ఉంది గనక వెంటనే మంజూరు చేయాలి.

9) కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, నదీ జలాల పంపకంలో నెలకొన్న వివాదాలను ముగించేలా చొరవ చూపాలి.

10) కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. అందుకు తగినట్టుగానే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలి.

11) ఏపీ విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలకు సంబంధించి వెంటనే విభజన ప్రక్రియను పూర్తి చేయాలి.

12) పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను అవకాశం ఉన్నంత త్వరగా పూర్తి చేయాలి.

13) గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలి.

14) వెనుకబడిన జిల్లాలకు ఏటా ఇచ్చే రూ.450 కోట్లు వెంటనే విడుదల చేయాలి.

15) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద తెలంగాణకు నిధులు కేటాయించాలి.

16) SC వర్గీకరణ చేపట్టాలి.