జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకల కోసం సైన్యం వేట కొనసాగుతోంది. తాజాగా, శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. బుద్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమైనట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. బుద్గాం జిల్లాలోని జోల్వా కరల్పొరా చందోరా ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. చందరో ప్రాంతంలో ఉగ్రవాదులన్నారన్న సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం గురువారం రాత్రి అక్కడకు చేరుకున్నాయని పేర్కొన్నారు.

భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో సైన్యం అప్రమత్తమైన ఎదురుకాల్పులు జరిపింది. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు కొనసాగినట్టు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలిలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉందని ఐజీ వివరించారు.

వీరు కూడా జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారేనని భావిస్తున్నారు. కాగా, రెండు రోజుల కిందట పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్ జాతీయుడు సహా ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లో రెండు వారాల్లోనే వేర్వేరు ఎదురుకాల్పుల్లో 15 మందికిపైగా ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.