అతి దారుణంగా నిత్య పెళ్లికొడుకు హత్య..

యువతుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ వ్యక్తిని దారుణంగా చంపేశాడు మరో యువకుడు. అదెలాగంటే.. తమిళనాడులో ని వేలూర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌‌ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి అన్న అతడిని స్నేహితుల సాయంతో అతిదారుణంగా చంపేశాడు. ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకుని.. ఏకంగా ఆరుగురు పిల్లలకు తండ్రైన ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా నాలుగో పెళ్లికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

కాగా వేలూర్‌ కొసపేట ఎస్‌.ఎస్‌.కె.మానియం వీధికి చెందిన ఉదయ్‌ అలియాస్‌ ఉదయకుమార్‌.. వేలూర్‌ ఇన్‌ఫెంటరీ రోడ్డులో ఓ క్లబ్‌ నడుపుతున్నాడు. ఇప్పటికే అతను ముగ్గురు మహిళలను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడి ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. తాజాగా కుట్టైమేడు ఏరియాలోని అతడు బైక్‌పై వెళ్తుండగా.. ఆటోలో వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు అడుకంపాలరై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

అయితే ఈ ఘటనపై వేలూర్‌ సౌత్ పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అప్పు అలియాస్‌ ఇమానువేల్‌, ఆటప్ప అలియాస్‌ నవీన్‌ కుమార్‌, అందిరేష్‌, నిర్మల్‌, వెంకటేశేష్‌, ఆల్వాలు ఈ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గురైన ఉదయకుమార్‌పై అనేక కేసులు పెడింగ్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అతను నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఓ యువతిని నాలుగో వివాహం చేసుకోవడానికి ఉదయ్ ప్రయత్నాలు చేస్తుండగా, ఆమె అన్న అడ్డుపడుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో యువతి అన్న ఐదుగురు ఫ్రెండ్స్‌తో కలిసి ఉదయ్‌ను కిరాతకంగా చంపేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.