నగల షాపులో ముసుగు దొంగల భారీ చోరీ

నగల షాపులో ముసుగు దొంగల భారీ చోరీ

ఇద్దరు ముసుగు దొంగలు నగలను కొనడానికని వచ్చి నగల షాపులో భారీగా ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటన ఐటీసిటీలో జాలహళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంఇఎస్‌ రోడ్డు బీఇఎల్‌ సర్కిల్‌ సమీపంలో వినోద్‌ బ్యాంకర్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అంగడి ఉంది. ఆదివారం ఉదయం యజమాని రాహుల్‌ జైన్‌ వచ్చి అంగడిని తెరిచాడు. ఇదే సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నగలు కావాలని షాపులోకి వచ్చారు. యజమాని కొన్ని గొలుసులను చూపించాడు.

టేబుల్‌ పై పెట్టగానే ఉంగరం చూపాలని అడిగారు. యజమాని ఉంగరం తేవటానికి లోనికి వెళ్లగా వెంబడించి పిస్టల్‌ను చూపించి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు. అంగడిలోని సుమారు కోటి రూపాయిలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. అతి కష్టం మీద రాహుల్‌ జైన్‌ కట్లు విడిపించుకొని వెళ్లి జాలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు లోపల, బయట సీసీ కెమెరాల్లో రికార్డయిన చిత్రాలను పోలీసులు స్వాదీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.