న్యూజిలాండ్‌పై అద్భుత విజయం

న్యూజిలాండ్‌పై అద్భుత విజయం

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 124 పాయింట్లతో కివీస్‌ను వెనక్కి నెట్టి నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇక రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్‌ రెండో ర్యాంకుకు పడిపోయింది. ఇక ఇండియా, కివీస్‌(121) తర్వాత ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్‌(107), పాకిస్తాన్‌(92 పాయింట్లు) టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి.

కాగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడిన సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా… ముంబై టెస్టులో మాత్రం కోహ్లి సేన ఏకపక్ష విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి కివీస్‌ బ్యాటర్లు చేతులెత్తేయడంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక మొట్టమొదటి డబ్ల్యూటీసీ విజేత కివీస్‌కు తొలి సిరీస్‌లోనే ఇలా ఓటమి ఎదురవడం గమనార్హం.