నెల రోజుల కిందట ఏపీలో పర్యటించి రాజకీయ కలకలం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తాను ఆంధ్రప్రదేశ్లో పర్యటించి వెళితే, యాదవ సంఘాల నాయకులను, తన వారిని వేధించడం ఏంటని బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో సగం కాపులకు మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీసిన ఆయన, వాటితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వం ఆశాజనకంగా లేదని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా, ఇక్కడి పాలకుల్లా దిగజారుడు రాజకీయాలను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మాట్లాడితే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ లోటు గురించి పదేపదే చెబుతోందని, ఆదాయం లేని చోట ఆర్భాట ప్రచారాలు ఎందుకని ? తెలంగాణలో తాము 24 గంటలూ కరెంట్ ఇస్తున్నామని, ఏపీలో మాటలకు మాత్రమే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న డబ్బులన్నీ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకేనని, ఎన్నికల తరువాత చేతులెత్తేస్తారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.