ట్రంప్ షాక్ : నిజమే అమెరికాలో చావులు ఆగవు

అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా మహమ్మారి (కోవిడ్‌-19) బారిన పడి చనిపోయే అమెరికన్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసిన క్రమంలో కరోనా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యంలో ఇప్పటికే 70 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. అలాగే.. లక్షలాది మందికి వైరస్‌ సోకింది.

అదేవిధంగా కరోనా వైరస్ సంక్షోభం వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అమెరికా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో పాటుగా.. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్‌ తొలిసారిగా అరిజోనాలో ఉన్న ఫోనిక్స్‌లో గల హనీవెల్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. మాస్కులు తయారీ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్స్ నిబంధనలను సడలించి… ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం ద్వారా కరోనా మృతులు పెరిగే అవకాశం ఉంది కదా అంటూ విలేకరులు ప్రశ్నించారు. ఆ సమయంలో ‘అవును ఆ అవకాశమైతే ఉంది. మనం అపార్టుమెంటులోనో, ఇంట్లోనో లాక్‌ చేసుకుని ఉండలేం కదా. కరోనా ప్రభావం ఉంటుందని తెలుసు. అయితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కూడా ముఖ్యమే’ అంటూ ట్రంప్‌ స్పష్టం చేశారు. అలాగే.. మాస్కుల తయారీ కర్మాగారాన్ని సందర్శించిన సమయంలోనూ ట్రంప్‌ మాస్కు ధరించకపోవడం చూసేవారికి వెగటుగా అనిపించింది.

అంతేకాకుండా కరోనా పోరులో ముందుండే వైద్య సిబ్బంది కోసం తయారు చేసిన మాస్కులను విలేకరుల ముందు ప్రదర్శించిన ట్రంప్‌.. తాను మాత్రం మాస్క్ ధరించకపోవడం విచారకరం. అయితే మాస్కును ఫ్యాక్టరీ సిబ్బంది ఇవ్వబోగా వారించారు కూడా. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుత స్థానంలో ఉండి కనీస జాగ్రత్తలు పాటించకుండా ట్రంప్‌ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారని ప్రతిపక్షం మండిపడుతోంది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్న వారికి ట్రంప్‌ మద్దతు ఇవ్వడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. కాగా మహమ్మారి అంతా ఓ బూటకం అని నినదిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్న వారిని ట్రంప్‌ ఎంకరేజ్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ట్రంప్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించకుంది. ఇదిలా ఉండగా.. శ్వేతసౌధ వర్గాలు మాత్రం మాస్కు విషయంలో ట్రంప్‌ వ్యవహారశైలిని వెనకేసుకొచ్చాయి. ట్రంప్‌ తో పాటు ఇతర ఉన్నతాధికారులు తరచుగా కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకుంటున్నారని.. అందుకే అంతగా భయపడాల్సిన పనేం లేదని చెప్పుకోవడం విశేషం.