ట్రంప్‌ కుమారుడికి సోకిన కరోనా

ట్రంప్‌ కుమారుడికి సోకిన కరోనా

అమెరికా అధక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు బారన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని యూఎస్‌ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ బుధవారం వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలో బారన్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. బారన్‌ ప్రస్తుతం టీనేజర్ కావడంతో ఎటువంటి లక్షణాలు లేవని మెలానియా తెలిపారు. అక్టోబర్ 2న ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారితో పాటు వైట్ ‌హౌజ్‌లోని సిబ్బంది కొందరికి కరోనా వచ్చింది. మూడు రోజుల పాటు సైనిక ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్‌ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత వారు కోవిడ్ నుంచి కోలుకున్నారు. చదవండి : నేను సూపర్‌ మ్యాన్‌ను: ట్రంప్‌

బుధవారం నాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, “నా చిన్న కుమారుడు ఇప్పుడు బాగానే ఉన్నాడు” అని చెప్పారు. వైరస్‌ తనకు చాలా స్వల్ప కాలం కనిపించిందని, బహుశా అతడికి ఈ వైరస్ సోకిందని కూడా తెలిసి ఉండదన్నారు. బారన్‌ రోగ నిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల ప్రమాదం లేదన్నారు. కాగా మెలానియా ట్రంప్‌ తనకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని, అతి త్వరలోనే ప్రథమ మహిళ బాధ్యతలను తిరిగి మొదలుపెడతానని ఆమె చెప్పారు. కరోనా సోకిన తరువాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానని పేర్కొన్నారు. అదే విధంగా ముగ్గురికి ఒకేసారి కరోనా సోకడం ఆనందంగా ఉందని.. ఎందుకంటే ఒకరినొకరు చూసుకుంటామని, కలిసి సమయం గడపవచ్చునని మెలానియా తెలిపారు.