డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం

డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం

శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్‌ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు.

డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖ నుంచి తరలించారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణం విడిచిన ఆయన భౌతికకాయాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ అనాటమీ విభాగంలో ఎంబాంబ్ మెంట్ చేపట్టారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. రెండు గంటల పాటు జరిగిన ఈ ప్రక్రియ అనంతరం భౌతికకాయాన్ని విశాఖ నుంచి తిరుపతి తరలించారు.

ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని చూసి పలువురు చలించిపోయారు. తిరుమల వెంకన్న స్వామితో ఆయన సుదీర్ఘ అనుబంధం గుర్తు చేసుకున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి డాలర్ శేషాద్రి అకాల మరణం పై విచారణ వ్యక్తం చేశారు. రేపు తిరుపతి గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

తిరుమలలో1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ చేశారు. 1978లో టీటీడీలో చేరిన ఆయన.. 2006 జూన్ లో రిటైరయ్యారు. అప్పటి నుంచి ఓఎస్డీగా కొనసాగుతున్నారు.