చిచ్చురేపిన కుటుంబ కలహాలు

చిచ్చురేపిన కుటుంబ కలహాలు

కలహాలు ఓ కుటుంబంలో చిచ్చురేపాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి ఆత్మహత్యకు కారణమయ్యాయి. వ్యవసాయ భూమి విషయంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన తమ్ముడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలిసిన సోదరి సైతం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం నక్కలపెల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మహ్మద్‌ రబ్బానీ (43), సైదాబీ అక్కా తమ్ముళ్లు. ఒకే ఊళ్లో వేర్వేరుగా ఉంటున్న వీరి మధ్య కొంతకాలంగా వ్యవసాయ భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి.

ఆదివారం కూడా గ్రామ పెద్దల ఎదుట ఇదే విషయమై పంచాయితీ జరగగా, 2 కుటుంబాలు మరోసారి గొడవ పడ్డాయి. ఈ క్రమంలో అక్క సైదాబీ.. రబ్బానీని దుర్భాషలాడింది. దీంతో మనస్తాపానికి గురైన రబ్బానీ, అతని కుమార్తె మొహిరున్నీసా (22) గడ్డి మందు తాగారు. వీరిద్దరిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం రబ్బానీ మృతి చెందాడు. మొహరున్నీసా పరిస్థితి విషమంగా ఉంది. అయితే, రబ్బానీ మృతి వార్త తెలియగానే సైదాబీ సైతం ఇంట్లో ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి పరిశీలించగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.