సుశాంత్ కేసులో… ఠాక్రే పుత్రుడిపై ఆరోపణలు

సుశాంత్ కేసులో... ఠాక్రే పుత్రుడిపై ఆరోపణలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. ఈ కేసులో తన కుమారుడు ఆదిత్య సహా మహారాష్ట్ర పుత్రులెవరికీ సంబంధం లేదని స్పష్టం చేశారు. శివసేన దసరా ర్యాలీలో ఉద్ధవ్ మాట్లాడుతూ… తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కంగన రనౌత్‌‌‌కు చురకలంటించారు. ముంబై పోలీసులు, తన కుమారుడు ఆదిత్య సహా ‘మహారాష్ట్ర పుత్రుల’పై నిందలు వేశారని మండిపడ్డారు. బీహార్ పుత్రుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని కొందరు అంటున్నారు, అది నిజమే కావొచ్చు.. కానీ, అంతమాత్రాన మహారాష్ట్ర పుత్రులు సహా నా కొడుకుపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు.

తాము పూర్తి స్వచ్ఛంగా ఉన్నామని, న్యాయం కోసం ఏడుస్తున్నవారు ముంబై పోలీసులను పనికిరాని వారిగా చిత్రీకరిస్తున్నారని పరోక్షంగా కంగనకు చురకలంటించారు. ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా, ఇక్కడ అందరూ మత్తుపదార్థాలకు బానిసలైన వారిగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మన ఇంట్లో తులసి మొక్కను పెంచుతాము.. గంజాయిని కాదన్న విషయం వారికి తెలియదు.. గంజాయిని మీ రాష్ట్రంలోనే పండిస్తారు. అదెక్కడో మీకు తెలుసు.. కానీ, మా మహారాష్ట్రలో కాదు’ అని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కంగనను ఉద్దేశించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మా ముంబై పోలీసులను చూసి తాము గర్విస్తామని, వారు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నారని 26/11 మారణహోమాన్ని గుర్తు చేశారు.

ముంబయిను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారంటే అది ప్రధానికే అవమానమని, పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఇప్పటికి ఆరేళ్లయినా అతీగతీ లేదని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సుశాంత్ మరణం వెనుక ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి, ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే మరికొందరికి సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన తర్వాత తొలిసారి మహారాష్ట్ర సీఎం స్పందించారు.

సుశాంత్ మరణంపై తొలుత ముంబయి పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సోషల్ మీడియాలో దీనిపై ఆరోపణలు రావడం, సుశాంత్ కుటుంబసభ్యులు నటి రియా చక్రవర్తి, ఆమె బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది. క్రమంగా ఇది రాజకీయ రంగును సంతరించుకోవడంతో బీజేపీ, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. చివరకు కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది.