కేసీఆర్‌ దీక్షపై కేంద్రం రియాక్షన్

కేసీఆర్‌ దీక్షపై కేంద్రం రియాక్షన్

యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన కేసీఆర్.. రైతులతో పెట్టుకుంటే తట్టుకోలేరంటూ హెచ్చరిక చేశారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని అల్టిమేటం జారీచేశారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ దీక్షపై కేంద్రం తాజాగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లుగా పారా బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయలేమంటూ కేంద్ర ఆహార ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే స్పష్టం చేశారు.

‘2021-22 రబీ సీజన్‌కు సంబధించి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపలేదు. ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అనేకసార్లు కోరాం. రబీ నుంచి ముడి బియ్యం సేకరణపై ప్రతిపాదనల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే వారు కోరుతున్నట్లు పారా బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయలేమని స్పష్టం చేసింది.

ఐదారు సంవత్సరాలుగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ అనూహ్యంగా పెరిగింది. అయితే భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. రా రైస్ మాత్రమే ఇస్తామని 2020-21లోనే రాతపూర్వకంగా భారత ఆహార సంస్థకి రాసి ఇచ్చింది. ఎఫ్‌సీఐ దగ్గర ఇప్పటికే మూడేళ్లకు సరిపడా పారా బాయిల్డ్ రైస్ నిల్వలున్నాయి. అందువల్ల ఆ రైస్‌ను కొనుగోలు చేయలేమని తెలంగాణ ప్రభుత్వానికి చెబుతున్నాం’ అని కేంద్రం వివరణ ఇచ్చింది.