నేడు వంగవీటి రంగా వర్ధంతి నేపద్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బారీ ఏర్పాట్లు చేశారు. అయితే నిజంగా వర్ధంతి కోసమేనా లేక తన బలం ప్రదర్శించడానికేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంగవీటి రంగా 30 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు బారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాదా రంగా మిత్ర మండలి అద్వర్యంలో పెద్దెత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం రంగా స్వస్థలం కృష్టా జిల్లా కాటూరులో ఏర్పాట్లు పూర్తి చేశారు. వంగవీటి రంగా వర్దంతి యేటా విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సారి భారీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కాటూరు గ్రామంలో మూడెకరాల విస్తీర్ణంలో వంగవీటి రంగా స్మారక భూమికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో రంగా అభిమానులకు ఆహ్వానాలు పంపించారు. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వైసీపిలో ఉన్న రాధా విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో పార్టీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. గత రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆయన్ని తూర్పు నియోజకర్గానికి వెళ్లమని సూచించినా ఆయన ససేమిరా అంటున్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఎంత మంది వచ్చి నచ్చజెప్పినా రాధా మాత్రం వినలేదని చెబుతున్నారు.
అయితే సెంట్రల్ విషయంలో తనకు అవమానం జరిగిందని బావిస్తున్న రాధా తన బలం చూపించేందుకు రంగా వర్ధంతిని వేదికగా మార్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ టిక్కెట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని భావిస్తున్న రాధా మొదటి సారి తన చేతల ద్వారా వైసీపీపై వ్యతిరేకతను ప్రదర్శించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ సెంట్రల్ లో పని చేసుకోమని వంగవీటి రాధాకు సూచించారు. దాని ప్రకారం ఆయన అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో మల్లాది విష్ణును పార్టీలో చేర్చుకుని ఆయనకే నియోజకవర్గ పదవి ఇచ్చారు. దీనిపై వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఆయన విజయవాడ తూర్పు లేదా మచిలీ పట్నం పార్లమెంట్ టిక్కెట్ ఇస్తామని వైసీపీలోని కొంత మంది నేతలు రాయబారం చేసినా జగన్ మాత్రం మాట్లాడలేదు. దీంతో వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తిలో ఉన్నారు. అప్పటి నుంచి మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు వంగవీటి రాధా. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయన అనుచరులుకూడా వైసీపీ జెండాలను తీసేశారు. తాజాగా ఈ రోజు వంగవీటి మోహనరంగా 30వ వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమంలోనూ ఎక్కడా వైసీపీ ప్రస్తావన రాలేదు. కనీసం వైసీపీ జెండాలు కూడా పెట్టుకోలేదు. రంగా స్వగ్రామం కాటూరులో మూడు ఎకరాలలో రంగా పేరుతో స్మృతి స్థూపం నిర్మిస్తున్నారు. దీనికి శంకుస్థాపన అక్కడా పార్టీ ప్రస్తావన తీసుకు రాలేదు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎక్కడా వైసీపీ జెండా కనిపించలేదు. దీంతో వంగవీటి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.