నిర్మాతగానూ సక్సెస్ అవుతున్న ‘అర్జున్ రెడ్డి’

నిర్మాతగానూ సక్సెస్ అవుతున్న ‘అర్జున్ రెడ్డి’
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తారు. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో తన వద్దకు వచ్చిన కథను.. ఆ సినిమా డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ను హీరోగా చేసి ఇప్పుడు తెరకెక్కించారు. ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ ఇప్పటి వరకు రాని ఒక కొత్త స్టోరీ లైన్‌తో వచ్చిన చిత్రంలో అభినవ్ గోమఠం, అనసూయ, వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అంతికా మిశ్రా నటించారు. షమీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.
నటీనటలు, సాంకేతిక వర్గం సంగతి పక్కనబెడితే.. ఇది విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. విజయ్ దేవరకొండ అయితే ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ వీడియో కూడా చేశారు. మొత్తం మీద అంచనాల నడుమ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. మరోవైపు, హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో గురువారం రాత్రి సెలబ్రిటీ ప్రీమియర్ షో కూడా వేశారు. సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతానికి అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా ఫుల్ కామెడీగా ఉందని అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఫన్ రైడ్ అని కొంత మంది ట్వీట్లు చేశారు. చూడదగిన సినిమా అని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో అయితే నవ్వలేక పొట్టచెక్కలైపోతుందని కూడా అంటున్నారు. ఇక సెలబ్రిటీ షో చూసినవాళ్లలో చాలా మంది సినిమా గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ అద్భుతంగా చేశారని, అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్ సూపర్ అని చెబుతున్నారు. మొత్తం మీద హీరోగా సూపర్ సక్సెస్ అయిన విజయ్ దేవరకొండ.. నిర్మాతగానూ సక్సెస్ అయినట్టే.