పవన్‌ కళ్యాణ్ పైన ఆశలు పెట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్‌

పవన్‌ కళ్యాణ్ పైన ఆశలు పెట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్‌

పవన్‌కళ్యాణ్‌ కి మైత్రి మూవీ మేకర్స్‌ అడ్వాన్స్‌ ఇచ్చి అయిదేళ్లు పైనే అయింది. అడ్వాన్స్‌ అంటే అల్లాటప్పాగా కోటీ, రెండు కోట్లు కాదు. అచ్చంగా అయిదు కోట్లిచ్చి ఇంతకాలం కనీసం తిరిగి కూడా ఆశించలేదు. పవన్‌ రాజకీయాల్లోకి వెళ్లినా కానీ తిరిగి నటిస్తే తమతోనే మొదటి సినిమా చేస్తాడనే నమ్మకంతో ఆ డబ్బులు అలాగే వుంచేసారు.

తీరా పవన్‌ తిరిగి నటించే ఆలోచన చేస్తున్నా కానీ మైత్రి వాళ్లతో సినిమా పట్ల ఆసక్తి చూపించడం లేదు. పింక్‌ రీమేక్‌ అయితే తనకి అనుకూలంగా వుంటుందని దాని మీదే మొగ్గు చూపుతున్నాడు. దానికి దిల్‌ రాజు నిర్మాత అనేది తెలిసిందే. దీంతో తనకోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తోన్న నిర్మాతలని కాదని పవన్‌ అలా సడన్‌గా వేరే నిర్మాతకి డేట్స్‌ ఎలా ఇస్తాడనే కామెంట్స్‌ పడుతున్నాయి. పవన్‌కి మనస్సాక్షి వుంటే రీఎంట్రీ సినిమా మైత్రి వాళ్లకే చేయాలని అంటున్నారు.

మైత్రి వాళ్లు కూడా పవన్‌నుంచి అంగీకారం పొందడం కోసం హరీష్‌ శంకర్‌కి అడ్వాన్స్‌ ఇచ్చి అతనితో కథ రాయిస్తున్నారు. మాట మీద నిలబడతాడనే పేరున్న హీరో కనుక పవన్‌ ఎలాగయినా తమకి ముందుగా సినిమా చేస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే క్రిష్‌ తన సినిమా చేసేస్తున్నాడంటూ మీడియాకి అదే పనిగా లీక్స్‌ ఇస్తున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ డిజాస్టర్‌ అయిన తర్వాత ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో క్రిష్‌ ఇప్పుడు పవన్‌లాంటి స్టార్‌తో చేయాలని చూస్తున్నాడు.