Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అవకాశాలు ఆయనకు క్యూ కట్టాయి. ఆ క్రమంలో విజయ్ ఒప్పుకున్న తొలి సినిమా ఏం మంత్రం వేశావె. శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చి 9న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. విజయ్ కు జోడీగా కొత్త హీరోయిన్ శివానీ సింగ్ నటిస్తోంది. హీరోయినే కాదు… చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక బృందం అందరూ కూడా కొత్తవారేనట. గోలీసోడా ఫిలింస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత ఏడాది దీపావళి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఇవాళ కొత్త స్టిల్స్ విడుదల చేసింది.
విభిన్నమైన కథకథనాలతో ఈ సినిమా తెరకెక్కిందని, విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తాయని చిత్ర సమర్పకుడు మల్కాపురం శివకుమార్ చెప్పాడు. విజయ్ దేవరకొండ కెరీర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఏం మంత్రం వేశావే నిలుస్తుందన్నాడు. అర్జున్ రెడ్డితో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన విజయ్… ఈ సినిమాతో ఏం మంత్రం వేస్తాడో చూడాలి. ఈ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. దీంతో పాటు టాక్సీవాలా మూవీ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మహానటిలోనూ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు విజయ్.