రాయుడు స్థానంలో ఎంపికైన విజయ్ శంకర్

రాయుడు స్థానంలో ఎంపికైన విజయ్ శంకర్

ఇంగ్లాండ్ గడ్డపై 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో అంబటి రాయుడికి చోటు కల్పించకపోవడం తప్పిదమేనని భారత మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ తాజాగా అంగీకరించాడు. అప్పటి వరకూ బ్యాటింగ్ ఆర్డర్ నెం.4లో రాయుడికి వరుసగా అవకాశాలిచ్చిన భారత సెలెక్టర్లు.. వన్డే ప్రపంచకప్‌కి మాత్రం నెం.4 స్థానం కోసం ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు.

వరల్డ్‌కప్‌కి జట్టుని ప్రకటించే సమయంలో రాయుడికి బదులుగా శంకర్‌ని ఎంపిక చేయడంపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు కోణాల్లో టీమ్‌కి ఉపయోగపడతాడు’’ అని వెల్లడించాడు. దాంతో.. చిర్రెత్తిపోయిన అంబటి రాయుడు.. వరల్డ్‌కప్‌ని చూసేందుకు 3Dగ్లాస్‌‌ని ఆర్డర్ చేసినట్లు ట్వీట్ చేయడం.. అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన టీమిండియా.. పేలవ పరాజయంతో ఇంటిబాట పట్టింది. ఆ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ నుంచి ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా టీమ్‌ని ఆదుకోలేకపోయాడు. ఒకవేళ జట్టులో అంబటి రాయుడు ఉండింటే..? ఫలితం మరోలా ఉండేదనే వాదనలు కూడా వినిపించాయి. రాయుడు స్థానంలో ఎంపికైన విజయ్ శంకర్.. ఒక్క మ్యాచ్‌లో మినహా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తేలిపోయాడు.

అంబటి రాయుడిపై వేటు గురించి తాజాగా దేవాంగ్ గాంధీ మాట్లాడుతూ ‘‘అవును అది తప్పిదమే. కాకపోతే మేమూ మనుషులమే. అప్పుడు మేము ఎంపిక చేసిన జట్టు మంచి కాంబినేషన్ అని అనుకున్నాం. కానీ.. ఆ తర్వాత తెలిసింది. ఒకవేళ రాయుడు టీమ్‌లో ఉండింటే జట్టుకి ఉపయోగంగా ఉండేదని. వాస్తవానికి వన్డే ప్రపంచకప్‌లో ఆ మ్యాచ్ మినహా టీమిండియా మెరుగ్గా ఆడింది. కానీ.. రాయుడిపై వేటు గురించే ఎక్కువ చర్చ నడిచింది. రాయుడి బాధని నేను అర్థం చేసుకోగలను.. అతని అసహనంలోనూ న్యాయముంది’’ అని చెప్పుకొచ్చాడు.