అసెంబ్లీ పోటీకి సిద్ధమవుతున్న హీరోయిన్

అసెంబ్లీ పోటీకి సిద్ధమవుతున్న హీరోయిన్

హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ విజయశాంతి మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దుబ్బాక అసెంబ్లీ స్థానంలో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఆ స్థానంలో బరిలో నిలవబోతున్నారు.

ఐతే సానుభూతి కోణంలో ప్రధాన పార్టీలేవీ ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ నుంచి గత ఎన్నికలప్పటి అభ్యర్థి రఘునందన్ రావే ఇక్కడ పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థిని నిలపబోతున్నట్లు ప్రకటించింది.

మరి ఆ అభ్యర్థి ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. పార్టీ ముఖ్య ప్రచారకర్తల్లో ఒకరైన విజయశాంతిని బరిలో నిలిపే విషయంలో మెజారిటీ నాయకులు సుముఖంగా ఉన్నారని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆమె అభ్యర్థిత్వానికి ఓటేశారని అంటున్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా ఎన్నికైన విజయశాంతి.. ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పింది. ఎంపీగానూ రాజీనామా చేసింది.

ఆపై 2014లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి మెదక్‌లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ప్రచారంలో మాత్రం కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు విజయశాంతి దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిస్తే ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 13 ఏళ్ల విరామం తర్వాత ఆమె ఈ మధ్యే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ తర్వాత ఇంకో సినిమా చేయకుండా మళ్లీ రాజకీయాలకే అంకితమవ్వాలని నిర్ణయించుకుంది.