మైదానంలో స్టెప్పులేసిన కోహ్లి

మైదానంలో స్టెప్పులేసిన కోహ్లి

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. తొలి రోజు కేఎల్‌ రాహుల్‌ అద్భుత సెంచరీ… ఆధిక్యం మనదే.. గెలుపు సులువే అంటూ అభిమానుల ఆనందం.. కానీ రెండో రోజు ఆట చూద్దామనుకుంటే వరుణుడు ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.. వర్షం తగ్గకపోవడంతో ఆటను రద్దు చేశారు.. ఇక మూడో రోజైనా మనోళ్ల మెరుపులు చూడాలని భావించిన వాళ్లకు ఆరంభంలోనే తీవ్ర నిరాశ… లుంగి ఎన్గిడి, కగిసో రబడ దెబ్బ మీద దెబ్బ కొట్టారు. వరుసగా వికెట్లు కూల్చి 272 పరుగుల స్కోరు వద్ద ఆటను ఆరంభించిన భారత జట్టును 50 పరుగుల వ్యవధిలోనే ఆలౌట్‌ చేశారు.

పంత్‌, అశ్విన్‌, శార్దూల్‌, షమీ తదితరులు పట్టుమని పది పరుగులు చేయకుండానే పెవిలియన్‌ చేరారు. అయిపోయింది… అంతా అయిపోయింది అంటూ ఉసూరుమన్న అభిమానుల్లో.. సరిగ్గా అప్పుడే జోష్‌ నింపారు టీమిండియా బౌలర్లు. ప్రొటిస్‌ జట్టుకు చుక్కలు చూపిస్తూ… పదునైన బంతులు సంధిస్తూ వరుసగా వికెట్లు పడగొట్టారు. మరి వీరి అద్భుత ప్రదర్శన చూసిన అభిమానులకే కాదు.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ముచ్చటేసినట్లుంది. అందుకే మైదానంలోనే స్టెప్పులేస్తూ… బౌలర్ల విజయాన్ని ఆస్వాదించాడు.

ఆటను పూర్తిగా ఎంజాయ్‌ చేస్తూ జట్టును ప్రోత్సహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘‘విరాట్‌ భాయ్‌… నువ్వు అందరిలాంటి కెప్టెన్‌ కాదు… ఎక్కడున్నా కింగ్‌వే. నీ దూకుడే కాదు.. ఆటను ఎంజాయ్‌ చేసే విధానం కూడా మాకు ఇష్టం. అందుకే నువ్వు ప్రత్యేకమైనవాడివి’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసి… 146 పరుగుల ఆధిక్యంలో ఉంది.