పీటలమీద ఆగిపోయిన పెళ్లి

పీటలమీద ఆగిపోయిన పెళ్లి

వరుడి సోదరి, ఆమె భర్తకు విందులో ఆహారపదార్థాలు నచ్చకపోవడంతో వివాదం చోటుచేసుకుని పీటలమీద పెళ్లి ఆగిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లా సికిందర్‌పూర్ కోటాలో ఈ ఘటన బుధవారం జరిగింది. విందులోని పదార్థాలు రుచిగా లేవని వరుడి తరఫువాళ్లు చెప్పగా… వధువు సోదరుడు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో మాటామాటా పెరిగి వివాహం ఆగిపోయింది. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. దీంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది.

అలీగఢ్ సమీపంలోని సికిందర్‌పూర్ కోటా గ్రామంలో బుధవారం రాత్రి ఓ వివాహ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులంతా డీజేకు ఆనందంగా నృత్యం చేశారు. ఇదే సమయంలో వరుని సోదరి, ఆమె భర్త భోజనానికి వెళ్లగా, వారికి ఆ ఆహారం నచ్చలేదు. దీంతో పుల్లవిరుపు మాటలంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ విషయం తెలిసిన వధువు సోదరుడు వారి వద్దకు వచ్చి పరిస్థితి వివరించాడు. అయినా వారు అర్ధం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఈ సమయంలో వరుని అక్కాచెల్లెళ్లు వధువు సోదరుడిపై దాడి చేశారు.

ఇంతలో వధువు తరఫున బంధవులులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కళ్యాణమండపానికి చేరుకుని, ఇరువర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు మాత్రం రాజీకి ఒప్పుకోలేదు. ఇరువుర్నీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ వధువు, వరుడి తరఫున పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇంతలో వధువు కుటుంబం తాము వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లి కుమార్తెను అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేయానికి సిద్ధమవుతుండగా.. ఇరు వర్గాలు మళ్లీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపాయి. పెళ్లి ఆగిపోవడంతో విందుకైన ఖర్చు వరుడు భరించడానికి అంగీకరించాడని వివరించారు. దీనికి పోలీసులు సమ్మతించడంతో కేసు నమోదుచేయకుండా వదిలేశారు. పోలీస్ అధికార అభయ్ శర్మ మాట్లాడుతూ.. విందు రుచిగా లేదని వరుడి బావ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ మొదలయ్యిందన్నారు. ఇది చినికి చినికి గాలివానలా మారి పెళ్లి ఆగిపోయే వరకు వెళ్లిందన్నారు.