Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటకలో ఎన్నికల ప్రహసనం ముగిసి ఈరోజు ఎన్నికల కౌంటింగ్ కూడా మొదలయిపోయింది. ప్రస్తుతం తేలిన లెక్క ప్రకారం బీజేపీ సుమారు 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ మాత్రం 67 స్థానాల్లో హోరాహోరీ తలపడుతోంది. అయితే మరి కాసేపటిలో పూర్తి ఎన్నికల ఫలితాలు సైతం విడుదలైపోయి పార్టీలు, ఆయా పార్టీల నాయకుల జాతకాలు సైతం వెల్లడవుతాయి. అయితే, ఇప్పుడు బీజేపీ గెలిస్తే మోసం చేసిన పార్టీకి వోటేయద్దు అని పిలుపునిచ్చిన రాష్ట్రంతో సంబంధం లేని ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి ఏమిటా అనే చర్చ నడుస్తోంది.
కర్ణాటకలో ముందు నుండీ కాంగ్రెస్, బీజేపీలు హోరా హోరీ పోరాడాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే పార్టీలు రెండే అవీ కాంగ్రెస్, బీజేపీలు. అయితే, కాంగ్రెస్ కి వోటెయ్యమని చెప్పలేదు కానీ ఏపీకి నమ్మక ద్రోహం చేసిన బీజేపీకి, ఏపీకి అన్యాయం చేసిన మోడీకి తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు కర్ణాటకలోని తెలుగు వారికి పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికలకు రెండు నెలల సమయం ఉందనగా ఏపీలో బీజేపీతో తెలుగుదేశం పార్టీకి కటీఫ్ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి విషయంలో కేంద్రం చూపించిన సవితి తల్లి ప్రేమ భరించలేక ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.
సరిగ్గా ఇదే తరుణంలో వచ్చిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఉత్తరాది వారి పెత్తనంతో నడుస్తున్న పార్టీ కి తెలుగు వాడి పౌరుషం చూపించాలంటూ.. చంద్రబాబు కర్ణాటకలోని తెలుగు వారికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీలో ఎక్కడ సభ పెట్టినా.. కర్ణాటక ఎన్నికల గురించే మాట్లాడారు. కన్నడ ఎన్నికల్లొ బీజేపీని దెబ్బకొట్టేలా పిలుపునివ్వడంపై బీజేపీ అధిష్టానం కూడా తీవ్రంగా భావిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ.. చంద్రబాబు ప్రతి చర్యను ప్రత్యేకంగా రికార్డ్ చేయిస్తున్నారని తెలుస్తింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ గెలిస్తే బాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ప్రచారం సాగుతోంది.
బీజేపీ గెలిస్తే అది చంద్రబాబు దెబ్బగా మారే అవకాశాలు ఎక్కువ అని ఎందుకంటే ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. టీడీపీ లేక మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే తప్ప బండి నడవదు. కిందటి ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేశాయి. అందుకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈ సారి కూడ అలా చేయడానికి రెండు పార్టీలకి ఈగో అడ్డురావచ్చు ఎటు ప్రత్యామ్నయంగా జగన్ పార్టీ ఉండడం వల్ల బాబుని సీబీఐ వంటి కేసులతో ఇబ్బంది పెట్టె ప్రయత్నం జరుగుతుంది అని తెలుస్తోంది. మరి అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు దీనిని ఎలా తట్టుకుని నిలబడతాడో చూడాలి.