వైన్ తాగేవాళ్ళు ఇవి తినొద్దు

వైన్ తాగేవాళ్ళు ఇవి తినొద్దు

మందు తాగేటప్పుడు మంచింగ్ కోసం ఏది పడితే అది తినేయడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రమే కొన్ని ప్రత్యేకమైన మంచింగ్ తీసుకుంటుంటారు. అయితే మీరు తీసుకునే మంచింగ్ కారణంగానే హ్యాంగోవర్ వస్తుందన్న విషయం మీకు తెలుసా? మద్యపానంలో మంచింగ్ గా కొన్ని ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు. మరీ ముఖ్యంగా వైన్ తాగేవాళ్ళు కింద చెప్పే ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది.

వైన్ సేవించే కొంతమంది చాక్లెట్‌ను మంచింగ్‌గా తీసుకుంటారు. కానీ అది సరైన కాంబినేషన్ కాదు. చాక్లెట్ కారణంగా కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఇంకా అసిడిటీ పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి చాక్లెట్ ఎంత బాగున్నప్పటికీ దూరం పెట్టేయండి.వేయించిన ఆహారాలతో పాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను వైన్‌తో పాటు తీసుకోవద్దు. వీటివల్ల చాలా తొందరగా శరీరంలోని నీరు తగ్గిపోతుంది. దానివల్ల మీలో శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి బదులు గ్రిల్డ్ చికెన్ బాగుంటుంది.

మద్యం తాగేసమయంలో బ్రెడ్ తినడం అత్యంత చెత్త కలయిక అని చెప్పవచ్చు. మద్యపానం సేవించేటపుడు బ్రెడ్ అస్సలు తినకూడదు. శరీరంలోని నీటిశాతాన్ని తగ్గించి డీహైడ్రేట్ చేస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండడమే మంచిది.బీన్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల వైన్ తాగేటపుడు బీన్స్, కాయధాన్యాలు మొదలగు వాటిని ముట్టుకోవద్దు. దీనివల్ల మీ శరీరానికి ఒకరకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందువల్ల శరీరం మద్యాన్ని సరిగ్గా గ్రహించదు.మద్యం తాగిన తర్వాత పొరపాటున కుడా కాఫీ తాగవద్దు. ఇది మంచి కలయిక కాదు. దీనివల్ల మరుసటి రోజు ఉదయం వాంతులు అయ్యే అవకాశం ఎక్కువ. మద్యం తాగినవారు హ్యాంగోవర్‌ బారిన పడటానికి ఇది ప్రధాన కారణం కావచ్చు.

సాధారణంగా మద్యం తాగితే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయని వైద్యులు చెప్తుంటారు. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం ఆఫ్రికాలో మద్యం సేవించేవారు అందులో మంచింగ్‌గా పచ్చిమిరపకాయలను తీసుకుంటారట. వీరిలో ఎలాంటి లివర్ ప్రాబ్లమ్స్ లేవని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడించారు. అదే సమయంలో పచ్చిమిర్చి లేకుండా మద్యం తాగేవారు అనేక అనారోగ్య సమస్యలతో పాటు లివర్ సమస్యలతో బాధపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల మద్యం తాగేటప్పుడు అదనంగా పచ్చిమిర్చి ముక్కలను తీసుకోవడం ద్వారా ఎటువంటి కాలేయ సంబంధిత సమస్యలు లేకుండా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఇదే అదనుగా భావించి ఎక్కువ మొత్తంలో మద్యం తాగుతూ పచ్చిమిర్చి తినడం మొదటికే మోసం వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చిట్కాలను కేవలం ఎప్పుడో ఒకసారి మద్యం తాగాలనిపించిన వారు మాత్రమే పాటించాలని.. అప్పుడు వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు. అలా కాకుండా ప్రతిరోజూ మద్యం తాగేవారు పచ్చిమిర్చిని తినడం ద్వారా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటారని పరిశోధకులు చెప్తున్నారు.