రోగాలు మాయం చేస్తానంటూ మంత్రగాడు అత్యాచారం.. ఆపై దేహశుద్ధి

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరిగింది. ప్రకాశం జిల్లాలో కీచక మంత్రగాడు గుట్టు రట్టయింది. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని.. మైనర్ బాలికతో పూజ చేయిస్తే నిధులు సొంతం అవుతాయని నమ్మించిన విష్ణువర్ధన్ 45 రోజులుగా పూజలు చేస్తున్నాడు. ఆ తర్వాత వారం రోజులుగా బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అయితే ఇంట్లో గుప్త నిధులున్నాయని.. అవి దక్కాలంటే బాలికతో కలిసి పూజలు చేయాలని నమ్మించిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది అంటే.. తనకు మంత్ర శక్తులున్నాయని, తాయత్తులతో రోగాలు నయం చేస్తానని, గుప్తనిధులు వెలికి తీస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని… నమ్మి ఆశ్రయం కల్పించిన వ్యక్తి కూతురినే చెరబట్టాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం మాచవరానికి చెందిన విష్ణువర్ధన్‌ రోగాలు నయం చేస్తానని తాయత్తులు కడుతుంటాడు. దొనకొండ మండలం రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో అతడికి కొంతకాలంగా పరిచయం కొనసాగుతుంది. కొందరికి తాయత్తులు కట్టేందుకు అతడిని రామాంజనేయులు తన గ్రామానికి పిలిపించాడు. తెలిసిన వారింట్లో బస ఏర్పాటు చేశాడు.

అయితే లాక్‌డౌన్‌ కాలంతో పాఠశాలలకు సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్న రామాంజనేయులు కూతురిపై విష్ణువర్ధన్‌ కన్నేశాడు. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని.. బాలికతో పూజలు చేయిస్తే సొంతమౌతాయని ఆమె తల్లిదండ్రులను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాలిక, ఆ తల్లిదండ్రులు పూజలు చేసేందుకు ఒప్పుకున్నారు. మొత్తానికి విష్ణువర్ధన్‌ వ్యవహార శైలిని అనుమానించిన రామాంజనేయులు కుమారులు వద్దని ఎంత చెప్పినా.. వినిపించుకోలేదు. దీంతో 45 రోజులుగా విష్ణువర్ధన్‌ తనకు కేటాయించిన గదిలో పూజలు చేస్తున్నాడు. వారం రోజులుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటికి పొక్కితే క్షుద్ర పూజలు చేసి చంపేస్తానని ఆమెను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. చివరికి పూజల విషయం తెలుసుకున్న గ్రామస్థులు రామాంజనేయులు ఇంటికి వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు, బాలిక కుటుంబ సభ్యులు విష్ణువర్ధన్‌‌కు బడిత పూజ చేశారు.