కూల్‌డ్రింక్‌ తాగిన మహిళ మృతి

కూల్‌డ్రింక్‌ తాగిన మహిళ మృతి

కూల్‌డ్రింక్‌ తాగిన మహిళ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కాశీగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీగూడెం గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌బీ వారం రోజుల క్రితం ఉపాధి హామి కూలీ డబ్బులు తీసుకునేందుకు ఏపూరులోని పోస్టాఫీస్‌కు వెళ్లింది.

అక్కడ ఆమెకు తన దూరపు చుట్టమైన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బండోని పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్లా కలిసి కూల్‌డ్రింక్‌ తాగమని ఇచ్చాడు. కూల్‌డ్రింక్‌ తాగిన హుస్సేన్‌బీ తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్పటి నుంచి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చిక్సిత్స పొందుతున్న ఆమెను కుటుంబ సభ్యులు శనివారం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆదివారం మరోసారి అస్వస్థతకు గురై మృతిచెందింది.

కూల్‌డ్రింక్‌లో విషం కలపడంతోనే తన తల్లి మృతిచెందిందని మృతురాలి చిన్న కుమారుడు మస్తాన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు.