అవస్థలు పడుతున్న దేశం

అవస్థలు పడుతున్న దేశం

ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన దేశాల జాబితాలో వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది ఫిన్లాండ్. చిన్న దేశమైనా వనరుల పుష్కలంగా ఉన్న ఈ దేశంలో పని చేసే జనాభా తక్కువగా ఉండటం వల్ల దేశాభివృద్ధి కుంటుపడుతోంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు తమ దేశం వచ్చి పని చేస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తామని ప్రకటించింది.

ఫిన్లాండ్‌‌లో ప్రస్తుత 5.2 మిలియన్ల జనాభా ఉండగా.. అందులో పని చేసే వయస్సున్నవారు కేవలం 65 శాతం మంది మాత్రమే. 39.2 శాతం ఓల్డేజ్‌ డిపెండెన్సీ నిష్పత్తితో వృద్ధుల సమస్య అధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి ఇది 47.5 శాతానికి పెరగొచ్చు.

ఈ నేపథ్యంలో పని చేసేవారి సంఖ్యను పెంచుకునేందుకు ఫిన్లాండ్‌ చర్యలు చేపట్టింది. దేశంలో కార్యకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగాలంటే ఏడాదికి కనీసం 10-30 వేల మంది వలస రావాలని గ్రహించి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఫిన్‌లాండ్‌లో భవిష్యత్తును రూపుదించుకోండి’ అనే నినాదంతో విదేశీయులను ఆకర్షించేలా క్యాంపెయిన్ చేపట్టింది. విదేశీయులను నియమించుకునేందుకు ప్రైవేటు సంస్థల నిబంధనలను సరళతరం చేసింది.

ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడేందుకు ఆసక్తి చూపించిన వారికి ఫిన్లాండ్‌ పౌరసత్వం ఇచ్చి ఆహ్వానిస్తోంది. లేదంటే అక్కడ పని చేసేందుకైనా ఇమ్మిగ్రేషన్‌ సదుపాయం కల్పిస్తోంది. సాంకేతిక, హెల్త్ టెక్, డిజిటలైజేషన్, ఇతర అత్యంత అభివృద్ధి ఉన్న రంగాల్లో ప్రపంచస్థాయి నైపుణ్యాలున్న వ్యక్తులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

‘విదేశీ ప్రతిభను ఆకర్షించడం ద్వారా వైవిధ్యాన్ని పెంచి తద్వారా అవకాశాలను మెరుగుపరచడానికి.. తదుపరి తరం ప్రపంచ సాంకేతిక నాయకత్వాన్ని స్థాపించడానికి మేము వ్యూహాత్మక, ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను వివరించాం… రాబోయే 10 సంవత్సరాలలో ఫిన్లాండ్ ప్రభుత్వం ఏడాదికి 15,000 మంది విదేశీ విద్యార్థులను స్వాగతించాలని లక్ష్యంగా పెట్టుకుంది’ అని ఆ దేశ రాయబారి రిత్వా కౌకు-రోండే ఓ ప్రకటనలో తెలిపారు.

ఫిన్‌లాండ్ ప్రభుత్వ కార్యక్రమం 2019-2023లో భాగంగా 30,000 మంది విదేశీ ప్రతిభావంతులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.భారతదేశంలోని అత్యంత సాంకేతిక ప్రతిభను ఆకర్షించాలని, ఉద్యోగం, అధ్యయనం, జీవన అవకాశాలను ప్రత్యేకించి STEMలో అపార పరిజ్ఞానం ఉన్నవారిని ప్రోత్సహించాలని భావిస్తోంది.

గత దశాబ్దకాలంలో ఫిన్లాండ్‌కు వలస వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ దేశానికి వచ్చి కొన్నేళ్లపాటు అక్కడ పని చేసి తిరిగి స్వదేశానికి వెళ్లిపోతుంటారు. అలా 2019లో ఫిన్లాండ్‌ని విడిచి వెళ్లిన వారికంటే దాదాపు 15 వేల మంది అదనంగా ఆ దేశానికి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఆ దేశాన్ని విడిచి వెళ్లినవారిలో విద్యావంతులే ఎక్కువగా ఉండటంతో ఆ దేశ అభివృద్ధిని దెబ్బతీస్తోంది.

ఉద్యోగరీత్యా ఆ దేశానికి వలస వచ్చినవారు కరోనా మహమ్మారి వ్యాప్తితో స్వదేశానికి వెళ్లిపోతున్నారు. ఇది కూడా ఫిన్లాండ్‌ పాలిట శాపంగా మారింది. స్టార్టప్‌లు ఏర్పాటు, భార్యాభర్తలు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతిచ్చినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అయితే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక.. తిరిగి ఫిన్లాండ్‌ పూర్వపు శోభను సంతరించుకుంటుందని అక్కడి నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.