నది ఒడ్డలోంచి సెల్ఫీ.. జారి యువజంట మృతి

నవ దంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఎంతో తీవ్ర విషాదాన్ని మిగల్చిన ఘటన హాసన్‌ సమీపంలోని హేమావతి నదీ వద్ద తాజాగా చోటు చేసుకుంది. బేలూరు తాలుకా మురహళ్లి గ్రామానికి చెందిన అర్థేశ్‌(27), హెన్నలి గ్రామానికి చెందిన కృతికా(23)కు రెండు నెలల క్రితమే పెళ్లైంది.

అయితే అర్థశ్‌ బెంగళూరులో ఒక ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా సంస్థకు సెలవు ఇవ్వడంతో రెండు రోజుల క్రితమే మురహళ్లికి వెళ్లాడు. అత్తగారి ఊరు హెన్నళికి సమీపంలోని హేమవతి నది వద్దకు దంపతులు ఇద్దరూ బైకుపై చేరుకున్నారు. రాత్రి కావస్తున్న ఇంటికి రాకపోవటంతో అత్తమామలు ఆందోళన చెందారు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో నదీ ప్రాంతం వద్దకు వెళ్లగా బైక్‌ కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు నది చుట్టూ గాలింపు చేపట్టగా కృతికా మృతదేహం బయట పడింది. కాగా శుక్రవారం తెల్లవారు జామున అర్థేశ్‌ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను సకలేశపుర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నవదంపతులు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.