నీటి గుంతలో శవమై తేలిన యువకుడు

నీటి గుంతలో శవమై తేలిన యువకుడు

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన ఓ యువకుడు గ్రామ సమీపంలో ఓ నీటి గుంతలో శవమై తేలిన సంఘటన మండల పరిధిలోని నర్సప్పగూడలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ రామయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిలి ఉదయ్‌ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. సంక్రాంతి పండగకు ఇటీవలే ఊరికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ద్విచక్ర వాహనం తీసుకొని వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోయింది.

దీంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గ్రామ శివారులోని చేగూరు రోడ్డులోని టెక్స్‌టైల్‌ పార్క్‌లో గతంలో తీసిన పెద్ద నీటి గుంత వద్ద ఉదయ్‌ తీసుకెళ్లిన బైక్‌ను స్థానికులు గుర్తించారు. సోమవారం సాయంత్రం గజఈత గాళ్లతో గాలించారు. అప్పటికే చీకటి పడడంతో ప్రయత్నం విరమించారు. మంగళవారం ఉదయం యువకుడు శవమై తేలాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి పెద్దనాన్న యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.