వచ్చే నెలలో మామ పెళ్లి…..రోడ్డు ప్రమాదంలో మృతి

వచ్చే నెలలో మామ పెళ్లి.....రోడ్డు ప్రమాదంలో మృతి

వచ్చే నెలలో మామ పెళ్లి ఉండడంతో అతనితో కలిసి పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి అల్లుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పీ. శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు..వెల్దుర్తి మండలం ఎల్‌బండకు చెందిన మహబూబ్‌సాతో నందికొట్కూర్‌కు చెందిన యువతికి డిసెంబర్‌ 9న వివాహం జరగనుంది.

మహబూబ్‌సాతో నందికొట్కూర్‌కు వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చి డోన్‌ మండలం కమలాపురం గ్రామానికి వచ్చాడు. అక్క కొడుకు ఖాశీం బాషాను తీసుకొని ఎల్‌బండకు మోటార్‌ సైకిల్‌మీద వెళ్తూ..ఆర్‌ఎస్‌ రంగాపురం సమీపాన రోడ్డు పక్కన ఆగి ఉన్న మహేంద్ర లగేజీ వాహనాన్ని ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఖాశీంబాషా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

మహబూబ్‌సాకు కాలు విరిగింది. క్షతగాత్రున్ని 108లో బేతంచెర్ల సీహెచ్‌సీకి తరలించి, మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపించారు.  సమాచారం అందుకున్న ఎస్‌ఐ పీ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుని తల్లిదండ్రులు దూదేకుల పెద్ద దస్తగిరి, హుసేన్‌బీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.