కరోనాతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చా: మహా మంత్రి

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది కరోనా వైరస్. కోవిడ్-19 కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోరనా తీవ్రత విపరీతంగా ఉంది. అయితే మహారాష్ట్ర గృహనిర్మాణ మంత్రి జితేంద్ర అవ్హాద్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రిగారు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. తన నిర్లక్ష్యం కారణంగానే కరోనా వచ్చిందని స్పష్టం చేశారు. తాను కరోనాతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని… ఓ దశలో తాను బ్రతకననే ఉద్దేశ్యంతో… ఆస్తి మొత్తం ఆసుపత్రిలోనే తన కూతురుకు రాసిచ్చేశానని వెల్లడించారు.

నిజంగా ప్రతి వ్యక్తి తనపై తనకు నమ్మకం ఉండాలిని.. అది మరీ ఎక్కువగా ఉంటే ఫలితం వేరేలా ఉంటుందని అన్నారు. కరోనాపై తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారానే తాను వైరస్ బారిన పడినట్లుగా వివరించారు. కాగా మంత్రి అవ్హాద్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ఓ అధికారికి ఏప్రిల్ 13న కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందుగానే అప్రమత్తమైన అహ్వద్ వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి.. చికిత్స జరిపారు. కరోనావైరస్ బారిన పడిన ఆయన ఏప్రిల్ 22, మే10 మధ్య చాలా రోజులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు.

అవద్ ఏప్రిల్ 13 నుండి ఇంటి నిర్బంధంలో ఉన్నాడు. అతను బలహీనంగా చాలా అలసటతో బాధపడటంతో మొదట అతన్ని బృహస్పతి ఆసుపత్రికి తీసుకెళ్ళి.. ఏప్రిల్ 22న ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మూడు రోజుల వరకు వెంటిలేటర్‌లోనే గడిపాడు. మంత్రి భార్య కూడా పాజిటివ్ పరీక్షించి ఆసుపత్రిలో చేరింది. కాగా తాను మూడు రోజులు వెంటిలేటర్‌లో ఉన్నానని… వైద్యులు తన కుమార్తె నటాషాను పిలిచి.. తాను బ్రతికే అవకాశాలు తక్కువని చెప్పారని వెల్లడించారు. అలాగే.. కరోనా నుంచి తాను కోలుకుంటానని.. బ్రతుకుపై నమ్మకం లేకుండానే వైరస్‌తో పోరాటం జరిపానని మంత్రి వివరించారు.

అంతేకాకుండా తనను మొదట  ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నానని.. ఆ తర్వాత ఏమి జరిగిందో తనకు గుర్తు లేదని మంత్రి వివరించారు. ఇంకా తాను పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు… తనకు కోవిడ్ -19 ఉందని కూడా తెలియదని.. ఆ తర్వాత కొన్ని రోజులకు కరోనా అని ప్లేట్ మీద రాసినట్లు తాను గమనించానని స్పష్టం చేశారు. అప్పుడు తనకు కరోనా వచ్చిందని అర్థమైనట్లు మంత్రి వివరించారు. కాగా తాను బ్రతికే ఛాన్స్ లేదని భావించి తన ఆస్తి మొత్తం తన కూతురికే చెందేలా.. ఐసియూలోనే వీలునామా రాయించినట్లుగా వివిరించారు. ఏప్రిల్ 23 నుంచి 26 వరకూ తన జీవితంలో అత్యంత కీలకమైన రోజులుగా తెలిపిన ఆయన తన జీవన శైలి, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కారణంగానే తాను వైరస్ బారినపడ్డానని స్పష్టం చేశారు. మొత్తానికి ఇప్పుడు వైరస్ నుంచి బయట పడ్డానని.. ఆ తర్వాత తన జీవన విధానం పూర్తిగా మారిపోయిందని.. క్రమశిక్షణతో జీవిస్తున్నట్లు మంత్రి జితేంద్ర అహ్వద్  వివరించారు.