పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి నేటితో 20 ఏళ్లు. .

ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యి.. హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20 ఏళ్ళు పూర్తయింది. 2002 జులై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలుపెట్టారు. ప్రభాస్‌పై ఆయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్‌గా ఆశీర్వదించగా.. నేడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నారు.

ఈ సందర్బంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది. నిజంగా ఆ రోజు ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమే అనుకున్నాం. మా గోపీ కృష్ణ బ్యానర్‌లో ప్రభాస్‌ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్‌ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది.

జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్‌ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ.. ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్‌ని చుస్తే చాలా ఆనందంగా ఉంది.ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.