హైదరాబాద్‌ నడిబొడ్డున దారుణం…ఆరేళ్ళ పాప గ్యాంగ్ రేప్…హత్య !

Blind Girl Rape In Madhya Pradesh

హైదరాబాద్‌ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు అనంతరం ఆమెను గొంతుకోసి హత్య చేశారు. ఈ అమానవీయ ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అల్వాల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బిహారీ ముఠాయే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హోలీ సందర్భంగా అల్వాల్‌లో జరిగిన సంబరాల్లో చిన్నారి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే మాటు వేసిన బిహారీ ముఠా చిన్నారికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి గాలించడం మొదలు పెట్టారు. తమతో పాటు హోలీ సంబరాల్లో పాల్గొన్న కొందరు తన చెల్లిని తీసుకెళ్లినట్లు పాప అన్నయ్య చెప్పాడు. దీంతో స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా ఓ చోట పొదల్లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యాచారం చేసిన విషయాన్ని పాప బయటపెడుతుందన్న భయంతోనే దుండగులు గొంతుకోసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.