ఏడు చేపల కధలో అర్ధం పరమార్ధం…

Morality In the 7 Fishes Story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ.

అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడు కులు. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.

వేటాడిన చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు. గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.

గడ్డిమేటా గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్‌ అని అడిగారు.
ఆవు మేయలేదు అంది.

ఆవా, ఆవా ఎందుకు మేయలేదు అని అడిగారు.

గొల్లవాడు నన్ను మేపలేదు అంది. గొల్లవాడా⁉
గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.

అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగారు.

పిల్లవాడు ఏడ్చాడు అంది.

పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్‌ అని అడిగారు.

చీమ కుట్టింది అన్నాడు.

చీమా టీమ్ ఎందుకు కుట్టావ్‌ అన్నారు. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.

ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, …
రీజనింగ్‌ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.
నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది. అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా!

అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు. చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం. వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా⁉

నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్‌ ప్రశ్న. అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు. ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్‌ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు.

అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.

రాజుగారు అంటే మనిషి. ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం. జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.

రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే సప్త వ్యసనాలు. ఏమిటా వ్యసనాలు❓
కామం, వేట, జూదం, మద్యపానం, వాక్పారుష్యం (కఠినంగా, పరుషంగా మాట్లాడడం), దండ పారుష్యం (తీవ్రంగా దండించడం), అర్ధదూషణం (ధనాన్ని దుబారాగా ఖర్చు చేయడం),

వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
వీటిని ఎండగట్టాలి అంటే ఎవరికి వారే చేయాలి తప్ప, వేరే ఎవరో చేయ కూడదు. అందుకే కథలో ఏడు చేపలను రాజుగారి కొడుకులే ఎండగట్టినట్టు చెప్పారు.

ఈ నాటి సమాజంలో కామం, వేట, జూదం, మద్యం, దుర్భాష, ధనవ్యయం ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. పైన చెప్పిన సప్త వ్యసనాలు మనిషిని ఎలా పీడిస్తున్నాయో, సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం.

రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు. ఏమిటా చేప. అది కామం. దీన్ని జయించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది ఎండదు. కామం అంటే ఏమిటి❓లోకం అనుకునే సెక్స్‌ కాదు, కోరిక.

కోరిక ఒక పట్టాన చావదు. ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది. మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు. కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే. అందుకని కోరికలను జయించడం అసాధ్యం. ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.

ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది గడ్డిమేటు.

గడ్డిమేటు అంటే ఏమిటి
కుప్పకోసిన అజ్ఞానం. మన అజ్ఞానం కొండలాగా పేరుకుపోతే దాని నీడన ఎన్ని కోరికలైనా బ్రతుకుతాయి. గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు. కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼

ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు. మనిషి లో నేనున్నాను అన్న అహంకారమే గడ్డిమేటు. దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం. మరి అది పోవాలంటే ఏం చేయాలి

ఆవు వచ్చి మేయాలి. ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓ఆవు అంటే జ్ఞానం. జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.

అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం) జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగినవాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి❓

సామాన్యుడు జ్ఞానాన్ని గోరూపంలో దర్శించాలి. ఈ గోవును ఎవ్వరు మేపాలి. గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼

అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు. ఏమిరా నాయనా‼ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత ఒక మంచి గురువును పంపకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. వాడి ఆకలి తీరలేదు అంటే ఏమిటి అర్థం. వాడికి ఇంకా జ్ఞానం పొందే సమయం రాలేదు అని.ఇంకో మాటలో చెప్పాలంటే వాడికి దైవానుగ్రహం కలుగలేదు అని అర్థం.
ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది. ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.

ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం. సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.

చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం, మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. ఈ చీమలు ఆరుబైట బారులు తీరి తిరుగుతూ కనబడతాయా❓
లేదు. చీమలు ఎప్పుడూ పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓మనిషికి ఉండే అజ్ఞానం ఒక పుట్ట.
రేపటి రోజును గురించి బంగారు కలలు కనడం మరోపుట్ట.

ఈ రెండు పుట్టలలో ఉన్న వాళ్ళని చేరదీసి, రక్షించడమే భగవంతుడికి తెలిసిన విద్య. ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.