నిండుప్రాణాన్ని బలిగొన్న కోడి గుడ్ల ఛాలెంజ్

నిండుప్రాణాన్ని బలిగొన్న కోడి గుడ్ల ఛాలెంజ్

కోడి గుడ్లు తినే పోటీ ఒక వ్యక్తి నిండుప్రాణాన్ని బలిగొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో సోమవారం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. సుభాష్ యాదవ్ అనే వ్యక్తి తన స్నేహితునితో కలసి కోడి గుడ్లు తినేందుకు బీబీగంజ్ మార్కెట్‌కు వెళ్లాడు. అయితే అక్కడ హఠాత్తుగా వారిద్దరి మధ్య గుడ్లు తినే విషయంలో వాగ్వివాదం జరిగింది. 50 గుడ్లు తింటే రూ. 2,000 ఇవ్వాలంటూ స్నేహితుడు విసిరిన సవాలుకు సరేనన్న సుభాష్ 41 గుడ్లు తినేశాడు. అయితే 42వ గుడ్డు తింటుండగా అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు లక్నోలోని సంజయ్ గాంధీ పిజి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు రిఫర్ చేశారు. కొద్ది గంటల తర్వాత సుభాష్ మరణించాడు. అధిక తిండే అతడి ప్రాణం తీసిందని డాక్టర్లు చెప్పారు. కాగా, సుభాష్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ సంఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారని పోలీసులు చెప్పారు.