బాలుడి ప్రాణం తీసిన కొత్త సైకిల్.. వ్యవసాయ బావిలో పడి..

తెలంగాణలో ఘోరం జరిగింది. ప్రేమగా తల్లిదండ్రులు కొనిపెట్టిన సైకిల్ బాలుడి ప్రాణం తీసింది. పిల్లల సరదా తీర్చడం అనేది తల్లిదండ్రులు బాధ్యతగా ఫీలవుతుంటారు. అదెంతటిది అనేది ఆ సమయంలో చూడరు. అలా వారికి ఏం కావలంటే అది లేదనకుండా కొనిచ్చేస్తుంటారు. పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచుకోవాలని వారంతా భావిస్తుంటారు. అయితే తాజాగా ఓ చిన్నారి తనకు కొత్త సైకిల్ కొని పెట్టాలని కోరిన కోర్కెను తల్లిదండ్రులు కాదనలేకపోయారు. కన్న బిడ్డ కోరికను మన్నించి సైకిల్ కొని పెట్టారు. అయితే ఆ సైకిలే తమ బిడ్డ ప్రాణం తీయడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. సైకిల్ తొక్కుతూ సరదాగా వెళ్లిన చిన్నారి బావిలో శవమై తేలింది.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ గ్రామం విషాదంలోకి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన రేవంత్ సైకిల్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు కొత్త సైకిల్ కొనివ్వడంతో ఆదివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని సరదాగా ఆడుకుంటున్నాడు. ఇంతలోనే ప్రమాద వశాత్తు వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం అయినా తమ బిడ్డకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రలు ఆందోళనకు లోనయ్యారు. ఎక్కడకి వెళ్లాడా అంటూ ఊరంతా గాలించారు. అయినా బాలుడు ఆచూకీ లభించలేదు. దీంతో స్థానికుల సమాచారం మేరకు.. ఓ వ్యవసాయ బావిలో వెతకగా మృతదేహంతోపాటు సైకిల్ కనిపించింది. అర్థరాత్రి వరకు నీటిని తోడి బాలుడి మృతదేహం బయటకు తీశారు. అప్పటివరకు సైకిల్‌తో సరదాగా ఆడుకునే.. తమ బిడ్డ ఇక లేడన్న చేదు వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ఊరంతా విషాదంలో మునిగిపోయింది.