అత్యంత ప్రమాదకరమైన రాజధాని

అత్యంత ప్రమాదకరమైన రాజధాని

దేశ రాజధానివాసులు అత్యంత ప్రమాదకరమైన గాలిని పీల్చుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో శుక్రవారం వాయు నాణ్యత అత్యంత విషమం స్ధాయికి పడిపోయిందని వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) స్పష్టం చేసింది. వాయు కాలుష్య నిరోధానికి విద్యుత్‌ జనరేటర్లపై నిషేధం వంటి కఠిన నిబంధనలను అమలుచేస్తున్న వాయు కాలుష్యం తీవ్రంగా ప్రబలడం ఆందోళన రేకెత్తిస్తోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఏక్యూఐ 316గా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిసారిగా వాయు నాణ్యత ఈ స్ధాయిలో దిగజారింది.

ఢిల్లీ సమీప నగరాలు ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, గ్రేటర్‌ నోయిడా, నోయిడాల్లోనూ వాయు నాణ్యత ప్రమాదకర స్ధాయిలో ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీకి 300 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న 11 బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను మూసివేసేలా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చొరవచూపాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఇటీవల విజ్ఞప్తి చేశారు. కాలుష్య స్ధాయిలను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నా పొరుగు రాష్ట్రాలు వెదజల్లే కాలుష్యం దేశరాజధాని వాయు నాణ్యతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.