అమరావతికి చేరుతున్న హీట్….భారీ భద్రత ?

Tight Security At AP Assembly In Amaravathi

రేపే ఎన్నికల కౌంటింగ్ అయినందున రేపు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కౌంటింగ్ ట్రెండ్స్ తెలిసిపోతాయి. చంద్రబాబు సర్కారు ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా? వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కైవసం చేసుకోనున్నారా ? అనే ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. గురువారం నాడు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్, 30కిపైగా పట్టణాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. డెసిషన్ డే రాజకీయ పార్టీల్లో హీట్ పుట్టిస్తున్న వేళ, ప్రధాన పార్టీల నేతలంతా అమరావతికి క్యూ కట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే విజయవాడకు చేరుకుని, సమీక్షలు నిర్వహిస్తుండగా, సాయంత్రానికి వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు. కుప్పం గంగమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రేణిగుంటకు చేరుకోనున్న చంద్రబాబు, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి తిరిగి రాత్రికి అమరావతికి రానున్నారు. ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుండటంతో ఏపీలో రాజకీయ వేడి ఇప్పుడు అమరావతికి మారింది. ఇప్పటికే జగన్, బాబుల నివాసాల వద్ద భారీ బద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఫలితాలు వెలువడ్డాక రాజధాని చుట్టుపక్కల ఊర్ల వారు అందరూ ఓకే సారి తమ తమ అధినేతల దగ్గరకి ఉత్సాహం కొద్దీ వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో అక్కడ భారీ బద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఇక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు, బార్లు, వైన్‌ షాపులు, కల్లు దుకాణాలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సాధారణంగా ఫలితాల అనంతరం విజేతలు సంబరాల్లో మునిగితేలుతారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్‌ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది.