దారుణం: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం… ఐదుగురు మృతి…

అమెరికాలో ఈరోజు తెల్లవారు జామున ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జార్జియాలో విమానం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. బంధువు అత్యక్రియలకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు అదికారులు వెల్లడించారు. కాగా ఫ్లోరిడా నుంచి ఇండియానాకు బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుందని అధికారులు వివరించారు.

కాగా దక్షిణ అట్లాంటాకు 100 మైళ్ల దూరంలో (161 కిలోమీటర్ల) ఈ విమానం కూలిపోయింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని ఫ్లోరిడాలోని మోరిస్టన్‌కు చెందిన ల్యారీ రే ప్రుయిట్టీ, షాన్ చార్లెస్ లమంట్, ఆయన భార్య జోడే రే లమంట్, ఇద్దరు చిన్నారులు జయసీ, అలీసీ‌గా అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గురైన పైపర్ పీఏ31-టీ విమానం ఫ్లోరిడాలో విల్‌‌స్టన్ నుంచి ఇండియానాలోని న్యూక్యాస్టిల్‌కు వెళ్తోందని అన్నారు. గాల్లో ఉండగానే విమానంలో మంటలు చెలరాగాయని.. తర్వాత భారీ శబ్దంతో కూలిపోయిందని స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి.. పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు వెల్లడిస్తున్నారు.