కోడెల కుమారుడి మీద మరో కేస్…క్రికెటర్ ని కూడా మోసం ?

another case on kodela saon

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌ మీద ఆరోపణలు ఇంకా వస్తూనే ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద శివరామ్‌ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు తాజాగా బయటకు వచ్చింది. సదరు ఆంధ్రా రంజీ క్రికెటర్‌ నాగరాజు నిన్న గుంటూరు రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాకి చెందిన అప్పలస్వామి కుమారుడు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరఫున గత ఐదేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నాడు. రెండేళ్ల క్రితం విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్‌ పరిచయమయ్యాడు. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగం చేయాలని ఉందని కోడెల శివరామ్‌కు చెప్పాడు. దాన్ని అవకాశంగా తీసుకుని శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో నిరుడు ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాలని శివరామ్‌ చెప్పాడు. అతడు చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాడు. అక్కడ కోడెల శివరామ్‌కు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు కబురు చేస్తామని చెప్పాడు. దీంతో నాగరాజు వెనక్కి వచ్చేశాడు. మే 23న ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల శివరామ్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్‌లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పారట దీంతో ఈ నెల 2న నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అయితే నాగరాజును బెదిరించిన కోడెల అనుచరులు బాండ్‌ పేపరును చించేశారు. పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు హెచ్చరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు తెలుస్తుందని, శుక్రవారం డబ్బు ఇస్తానని నరసరావుపేట రావాలని కోడెల పేర్కొన్నారు. అయితే అక్కడికి వచ్చాక గుంటూరులోని లక్ష్మీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని పంపారు. అక్కడికి వేలలో ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశాడు.