ప్రముఖ టీవీ నటిపై కత్తితో దాడి

ప్రముఖ టీవీ నటిపై కత్తితో దాడి

ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివాహ ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాల్వీని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని యోగేశ్‌కుమార్‌ మహిపాల్‌ సింగ్‌గా గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉత్తర ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని ఒక కేఫ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీపై నిందితుడు యోగేశ్‌ కుమార్‌ కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో యోగేశ్‌ కుమార్‌ తనకు ఏడాదిగా తెలుసని.. ఇద్దరం స్నేహితులమని తెలిపింది. ఈ క్రమంలో యేగేశ్‌ మాల్వీని వివాహం చేసుకోవాలని భావించాడు. ఆమె ఒప్పుకోలేదు. అంతేకాక అతడితో మాట్లాడటం మానేసింది’ అని తెలిపారు.

ఈ నేపథ్యంలో సోమవారం కేఫ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీని యోగేశ్‌ అడ్డగించాడు. ఎందుకు తనతో మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఆమె తనకు ఇష్టం లేదని చెప్పడంతో కత్తితో పొడిచి పారిపోయాడు. మాల్వీ ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెర్సోవా పోలీసులు వెల్లడించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయని.. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఇక యోగేష్.. ఫేస్‌బుక్ ద్వారా మాల్వీకి పరిచయం అయ్యాడని పోలీసులు వెల్లడించారు. తనను తాను నిర్మాతగా చెప్పుకుని మాల్వీతో పరిచయం ఏర్పరచుకున్నాడన్నారు. ఇదివరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్‌ను కలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.