కోడలితో అత్త గొడవ.. ఆపై ఆత్మహత్య

తెలంగాణలోని సంగారెడ్డిలో ఘోరం జరిగింది. అత్త మందలించిందనే కోపంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం కంచర్ల గ్రామానికి చెందిన శివాని(25)కి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన హనుమంతుతో 2014లో పెళ్లైంది. అయితే వీరు బతుకు దెరువు కోసం కొంతకాలం క్రితం పటాన్‌చెరులోని గోకుల్‌నగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. హనుమంతు తాపీమేస్త్రీగా పనిచేస్తుండగా.. అతని కింద పని చేసే వారికి భార్య శివాని రోజూ భోజనం వండి పెడుతూ ఉండేది.
అసలు ఏం జరిగింది అంటే.. నెలరోజుల నుంచి హనుమంతు తల్లి కూడా పటాన్‌చెరువుకు వచ్చి వారి వద్దే ఉంటుంది. శివానీ దంపతులు పనివారితో పాటే తాము కూడా అదే భోజనం తినేవారు. అయితే పనివారికి పెట్టే భోజనం తనకు వద్దని, వేరుగా వండాలని శివానీని అత్త ఆదేశించింది. దీంతో అత్తాకోడళ్ల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ నెల 9న హనుమంతు పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. గదిలోకి వెళ్లి చూడగా శివాని ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. దీంతో వెంటనే శివానీని పటాన్‌చెరువు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.