సైకిల్ పై వెయ్యి కి.మీ.. మధ్యలో కారు ఢీకొని వలస కూలీ మృతి..

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వారి జీవితాలు అతలాకుతలం కావడానికి లాక్ డౌన్ కారణమని చెప్పవచ్చు. చేసేందుకు పనిలేక, ఇంటికి వెళ్లాంటే సరైన రవాణా సదుపాయాలు లేక అల్లల్లాడిపోతున్నారు. అయితే ఏదోలా ఇంటిబాట పట్టిన కార్మికులను కరోనాకు తోడు.. విధి కూడా వారిని వెక్కిరిస్తూ ఉంది. ఎలాగైనా సొంతూరికి చేరుకోవాలనుకుంటున్న వారు మర్గమధ్యలోనే అనంత లోకాలకు వెళ్తున్నారు.అయితే లాక్‌డౌన్‌తో ఢిల్లీలో చేసేందుకు పనులు లేకపోవడంతో తన సొంతూకరుకు సైకిల్‌ మీద బయల్దేరాడు బీహార్‌కు వలస కార్మికుడు. 26 ఏండ్ల సఘీర్‌ అన్సారి ఢిల్లీ నుంచి బీహార్‌లోని తన సొంతూరైన తూర్పు చంపారన్‌కు వెయ్యికి పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. మే 5న తన ఏడుగురు స్నేహితులతో సైకిల్‌పై బయల్దేరాడు.

సగం దూరం చేరుకోవడానికి వారికి ఐదు రోజులు పట్టింది. శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకి సమీపంలో అల్పాహారం కోసం ఆగారు. ఆ సమయంలో రోడు మధ్యలో ఉన్న డివైడర్‌పై కూర్చుని టిఫిన్‌ చేస్తుండగా లక్నో నుంచి వస్తున్న కారు ఒక్కసారిగా వారిపై దూసుకెళ్లింది. దీంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన ఏడుగురు చిన్నచిన్న గాయాలతో తప్పించుకున్నారు. ఓ ఎన్‌జీవో సహకారంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగానే అన్సారి మధ్యలో మృతి చెందాడు. కారు డ్రైవరును అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అన్సారి మృతదేహాన్ని అంబులెన్సులో వారి సొంతూరుకు పంపించారు. కాగా అన్సారీకి భార్యా ముగ్గురు పిల్లలు ఉండటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.