అందాల పోటీలో రిక్షా డ్రైవర్‌ కూతురు

అందాల పోటీలో రిక్షా డ్రైవర్‌ కూతురు

అందాల పోటీలు..ఈ పేరు వినగానే అందరూ డబ్బున్న వారే పాల్గొంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక రిక్షా డ్రైవర్ తన‌ కూతురు ఈ అందాల కిరీటం గెలవాలని కలలు కన్నాడు. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరికి ఒక అడుగు దూరంలో తన కూతురికి ఆ అవకాశం చేజారిపోయింది. అయితే, వీఎల్‌సీసీ మిస్‌ ఇండియా పోటీలో రన్నరప్‌గా తన కూతురుని ప్రపంచం ముందు నిలబెట్టడంలో మాత్రం ఆయన విజయం సాధించాడు.

ఈ పోటీల్లో మన హైదరాబాదీ అమ్మాయి మానసా వారణాసి విన్నర్‌గా నిలవగా.. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాన్యా సింగ్ రన్నరప్‌గా నిలిచింది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ అందరి మన్ననలను పొందుతున్న మాన్యా విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. అందాల పోటీలలో నిలవాలంటే అందంగా ఉండాలి. చక్కని ముఖవర్చస్సు కలిగి, అందమైన శరీరాకృతి కోసం ఎన్నో చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న విషయమని చాలా మందికి ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడం వలన తమ ఆశను మనస్సులోనే చంపుకొంటారు. అయితే, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన మాన్యా సింగ్‌ అందరిలా ఆలోచించలేదు. ఈమె తండ్రి ఒక ఆటోవాలా‌. తల్లి ఇంటిలో పనులు చేసుకొంటూ తన ఇద్దరు పిల్లలను చూసుకొనేది. పేదరికం కారణంగా మాన్య కొద్దివరకే చదువుకొని ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది.

మాన్య డిగ్రి ఫీజు కోసం తల్లి దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్నికూడా కుదువపెట్టాల్సి వచ్చింది. తన ఖర్చుల కోసం ఇంట్లో వారు పడుతున్న కష్టాన్ని చూడలేని మాన్య పద్నాలుగు ఏళ్లప్పుడే ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. రాత్రిపూట కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేసుకుంటూ, ఉదయంపూట చదువుకునేదాన్ని అని చెప్పింది. మిస్‌ఇండియా పోటీల్లో గెలవాలని నిర్ణయించుకొని దీనికోసం ఎ‍న్నో తిండి, నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు నడిచి వెళ్తు రిక్షా డబ్బులు కూడా దాచుకునే దాన్నని మాన్యా గుర్తు చేసుకుంది. ఈ రోజు మానాన్న, అమ్మా, అన్నయ్య నాకోసం పడ్డ కష్టం, వారు నాకు అందించిన సహకారం వలనే ఈ స్థానంలో నిలిచాను’ అని ఆమె వివరించింది.